దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఏ పండగకు లేనంత డిస్కషన్ దీపావళి గురించి జరుగుతోంది. ఇందుకు కారణం దివాళికి కాల్చే టపాసుల వల్ల వచ్చే కాలుష్యం గురించే. అసలే కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో టపాసుల వల్ల మరింత ఇబ్బందులు వస్తాయేమో అన్న ఆందోళన అందరిలోనూ ఉంది.
దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దీపావళికి బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్లో చైనాకు సంబంధించిన టపాసులు విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా చైనా టపాసులు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒడిశా రాష్ట్రం కూడా బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించింది. దీపావళి, కార్తిక పూర్ణిమ పండుగల సందర్భంగా బాణసంచా విక్రయించరాదని, కాల్చరాదని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా ఇప్పుడు దీపావళి నాడు టపాసులపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో టపాసుల కాల్చివేతను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. శబ్దం రాని టపాసులను మాత్రమే కాల్చాలని ఆదేశాల్లో పేర్కొంది. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు లాంటివి మాత్రమే కాల్చాలని పేర్కొంది. అంతేగాక రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు పేల్చాలని ఆదేశాల్లో తెలిపింది. దీపావళికి టపాసుల కాల్చడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. గాలిలో కాలుష్యం పెరిగితే, కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం దీపావళి టపాసులపై ఆంక్షలు విధించింది. ఢిల్లీ బాటలోనే రాజస్థాన్, కర్ణాటక, ఒడిశా, హర్యానా రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి.