ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం వేడెక్కుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్న ఈసీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు ఇప్పుడే వద్దని చెబుతోంది.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు. ఈ మేరకు అందరికీ సమాచారం కూడా అందించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో నిన్న ఈ వీడియో కాన్పరెన్సు రద్దయింది. అయితే మరోసారి నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మరోసారి లేఖను రాసినట్లు తెలుస్తోంది.
దీంతో మరోసారి గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు ఎన్నికల కమీషనర్ కార్యాలయంలో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ కాన్ఫరెన్సులో జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లాల పంచాయతీ అధికారులు పాల్గొనాల్సి ఉంది. అయితే వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనేందుకు కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. దీంతో నేడు నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్సు కూడా రద్దయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏం జరుగబోతోందో అన్న ఉత్కంఠత నెలకొంది.
ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కమీషనర్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పక్కా క్లారిటీతో ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. కాగా కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఎన్నికల కమీషన్ నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్సులు రద్దవుతున్న నేపథ్యంలో ఈసీ ఏం చేయబోతోందో అన్న టెన్షన్ అందరిలోనూ ఉంది.