దేశంలో డ్రగ్స్ మాఫియా విజృంభిస్తోంది. ఇటీవలె ముంబై, హైదరాబాద్లలో వందల కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే అక్రమార్కులు కొత్త కొత్త రూట్లలో డ్రగ్స్ ను విక్రయిస్తున్నారు. తాజాగా కర్నాటకలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
కర్నాటకలోని స్కూళ్లలో పిల్లలకు ఐస్క్రీంలలో పెట్టి డ్రగ్స్ అమ్ముతున్నారన్న వార్తలు ఇప్పుడు దేశంలో హల్చల్ చేస్తున్నాయి. స్వయాన ఆ రాష్ట్ర మంత్రి సురేష్ కుమార్ దీనిపై మాట్లాడటం సంచలనంగా మారింది. కార్పోరేట్ స్కూళ్లలో చదివే ధనవంతుల పిల్లలను టార్గెట్ చేస్తున్న డ్రగ్స్ ముఠా వీరికి డ్రగ్స్ ఇచ్చేందుకు ఏకంగా స్కూళ్ల వద్దకే వస్తోందట. స్కూల్ బ్రేక్ సమయంలో బయటకు వచ్చే పిల్లలకు ఐస్ క్రీంలలో పెట్టి డ్రగ్స్ను ఇస్తున్నారని మంత్రి తెలిపారు.
పలు స్కూళ్ల వద్ద ఐస్క్రీం లో పెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను గుర్తించినట్లు చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏకంగా స్కూళ్లనే టార్గెట్ చేసిన డ్రగ్స్ ముఠా ఏ విధంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా పిల్లల తల్లిదండ్రులు కూడా కాస్త శ్రద్ద పెడితేనే ఈ డ్రగ్స్ ముఠాను అరికట్టవచ్చన్నది మేధావుల అభిప్రాయం.