పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇటీవలె కేంద్రంతో కూడా మాట్లాడింది. దీనికి కేంద్రం కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. అయితే ఎందుకు తెలుగుదేశం పార్టీ నేతలు దీన్ని రాద్దాంతం చేస్తున్నారో తెలియడం లేదు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పోలవరానికి సంబంధించిన పనులు జరిగాయి. అయితే అప్పుడే అన్ని పనులు చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేయొచ్చు కదా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే టిడిపి అప్పుడు దీన్ని పూర్తి చేయలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేస్తామంటే తమ హయాంలోనే ఇది దాదాపుగా పూర్తయింది.. ఇప్పుడు కేవలం కొంత పనులు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని టిడిపి అంటోంది.
70 శాతం పనులు టిడిపి హయాంలోనే పూర్తయ్యాయని నేతలు చెబుతున్నారు. అయితే జాతీయ ప్రాజెక్టయిన పోలవరాన్ని అప్పుడే ఎందుకు పూర్తిచెయ్యలేక పోయారో అని రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా మాజీ మంద్రి దేవినేని ఉమా మాట్లాడుతూ 16 నెలల కాలంలో పోలవరంకు సంబంధించిన ఎంత పనులు చేశారో చెప్పాలని అంటున్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
అయితే పోలవరంపై వైసీపీ ప్రభుత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంది. ఇరు ప్రభుత్వాల మధ్య ఉన్న సఖ్యత కారణంగా పనులు కూడా తొందరగా జరుగుతాయని అందరూ అనుకుంటున్నారు. మొన్న జరిగిన పార్లమెంటులో కూడా పోలవరం ప్రస్తావన వచ్చింది. పెండింగ్ బకాయిలు త్వరలోనే ఇస్తామని కేంద్రం తెలిపింది. దీన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని గ్రహించిన టిడిపి ఎలాగైనా క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో డిస్కషన్.