ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణవార్త వినగానే సినీ ప్రపంచంతో పాటు యావత్ దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఎంతో మంది ప్రముఖులు ఆయన్ను గుర్తుచేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. బాలు మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
కోట్లాది మంది ఆయన కోసం ప్రార్థనలు చేసినా బాల సుబ్రహ్మణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంగీత ప్రపంచానికే ఇది తీరని లోటని చంద్రబాబు అభిప్రాయం తెలిపారు. ఆయన పాడిన పాటల ద్వారా తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానిక తెలిసేలా బాలు కృషి చేశారన్నారు. బాలసుబ్రహ్మణ్యం గొంతు మళ్లీ వింటామనుకున్న తరుణంలోనే విషాదం జరిగిపోయిందని చంద్రబాబు ఆవేదన చెందారు.
అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, జన్మభూమి పథకం సందర్బంగా బాలు పాటలు పాడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన పాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేవన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.