బీహార్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. అయితే నరేంద్రమోదీ తన హవాను చాటి చెబుతూ బీహార్లో సైతం దూసుకుపోయారు. అయితే ఎన్నికల కౌంటింగ్ మాత్రం చాలా ఆలస్యంగా జరిగింది. దీనిపై ఒకింత ఆందోళన మొదలైంది. కౌంటింగ్ ఎందుకు ఆలస్యంగా జరుగుతోందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి.
బిహార్లో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగడంపై మహాకూటమి సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు పలు అభ్యంతరాల్ని వెలిబుచ్చుతున్నాయి. అయితే కౌంటింగ్ రోజే ఈసీ మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఎలాంటి ఇబ్బందులు లేవని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా ప్రతిపక్షాలు దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ సునీల్ అరోరా స్పందించారు. ఎన్నికల కౌంటింగ్ ఎందుకు ఆలస్యంగా జరిగిందో ఆయన పూర్తిగా స్పష్టం చేశారు.
కోవిడ్-19 అనంతరం నిర్వహించిన మొదటి ఎన్నికలు కాబట్టి పకడ్బంధీగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. భౌతికదూరం సహా వైద్యులు సూచిస్తున్న మరికొన్ని ప్రమాణాల్ని తప్పక పాటిస్తూ ఎన్నికలు, కౌంటింగ్ నిర్వహించామన్నారు. కౌంటింగ్ డెస్క్లో సాధారణంగా 14 మంది సభ్యులు ఉంటారని.. కానీ భౌతికదూరం నిబంధనల కారణంగా ఏడుగురు మాత్రమే విధులు నిర్వర్తించాల్సి వచ్చిందని తెలిపారు. దీనితో పాటు ఈసారి ఎన్నికల్లో అదనంగా 33 వేల పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కారణాల దృష్ట్యా లెక్కింపు ఆలస్యంగా జరిగిందని ఆయన వెల్లడించారు.