తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఇటీవల ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనలపై డీజీపీకి లేఖలు రాయడం మనం చూస్తూనే ఉన్నాం. కాగా నేడు కూడా చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు.
లేఖలో ఏమన్నారంటే.. వైసీపీ అవినీతి బయటపెట్టినందుకే గురుప్రతాప్రెడ్డి హత్య చేశారని ఆరోపించారు. గండికోట పరిహారం చెల్లింపులో అక్రమాలను బయటపెట్టారని తెలిపారు. గురుప్రతాప్రెడ్డి కేసులో నిందితులను శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అధికార పార్టీ అవినీతిపై ప్రశ్నించినవారిని వేధిస్తున్నారని, అవినీతి సమాచారం వెల్లడించినవారిని హత్య చేయడం దారుణమని చంద్రబాబు అన్నారు. కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురంలో గురుప్రతాప్రెడ్డిని వైసీపీ నేతలు హత్య చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.
పి.అనంతపురంలో 350 జనాభా ఉండగా స్వీయ లబ్ధి కోసం లిస్టులో అనర్హులను చేర్చి 750 మందికి పరిహారం చెల్లించాలని స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు ప్రయత్నించడం వల్ల గురుప్రతాప్రెడ్డి రూ.25 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని కోర్టును ఆశ్రయించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో స్పందించిన కోర్టు లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించగా ఉన్నతాధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారని, ఆ సభలో వాస్తవాలు బయటపెడుతున్న సమయంలో సభ సాక్షిగా గురుప్రతాప్రెడ్డి హత్య చేశారని టీడీపీ నేతలు వాపోయారు. మరి దీనిపై డీజీపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.