ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అత్యవసరం నిమిత్తం చాలా దేశాలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడం కూడా పలు దేశాల్లో ప్రారంభం అయ్యింది.
ఇక భారత్లో కూడా కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించేందుకు అన్ని చర్యలు వేగంగా జరుగుతున్నాయి. పలు వ్యాక్సిన్ కంపెనీలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. ఇక దేశంలో అభివృద్ధి చెందుతున్న కోవాగ్జిన్పై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అన్నీ కుదిరితే జనవరి లేదా ఫిబ్రవరిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ సరఫరాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసుకుంటున్నాయి.
జర్మనీ దేశంలో కరోనా వైరస్ నిరోధానికి ప్రజలకు కొవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమాన్ని డిసెంబరు 27 నుంచి ప్రారంభించనున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జెన్సు స్పాన్ ప్రకటించారు. ఆరోగ్య మంత్రుల సమావేశంలో బయో ఎంటెక్ వ్యాక్సిన్ ఆమోదం, సరఫరా గురించి ఆరోగ్యశాఖ మంత్రి స్పాన్ వెల్లడించారు. ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ ఆమోదించిన తర్వాత అన్ని దేశాలు ఒకే రోజున వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తామని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ చెప్పారు. ఫ్రాన్సు దేశం 3.5 మిలియన్ మోతాదుల కొవిడ్ టీకాలను డెలివరీ తీసుకుంటుందని, దీన్ని 1.7 మిలియన్ల మందికి సరిపోతుందని ఫ్రాన్సు దేశ ప్రధానమంత్రి జీన్ కాస్టెక్సు చెప్పారు. వృద్ధులు, ఆరోగ్య సంరక్షకులకు వ్యాక్సిన్ వేయడంలో ప్రాధాన్యం ఇస్తామని జీన్ చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ రెండు మోతాదుల్లో ఇవ్వనున్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇప్పటికే ఫైజర్, బయోఎంటెక్ టీకాలు వేస్తున్నారు.