కరోనా వచ్చినప్పటి నుంచి దేశంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే పరిస్థితి కొంచెం మెరుగవ్వడంతో పలు రైళ్లు తిరుగుతున్నాయి. అయితే పూర్తి స్తాయిలో రైళ్లు ఎప్పటి నుంచి తిరుగుతాయన్న దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ సాదారణ రైళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ కీలక ప్రకటన బయటకు వచ్చింది. సాధారణ రైళ్ల రాకపోకలు మళ్లీ ఎప్పటి నుంచి మొదలు కానున్నాయనే విషయంలో కచ్చితమైన తేదీని ప్రకటించలేమని రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం నడుపుతున్న కోవిడ్-19 ప్రత్యేక రైళ్లలో కూడా మొత్తంగా చూసుకుంటే 30 నుంచి 40 శాతం మాత్రమే ప్రయాణం చేస్తున్నారని, ప్రజల్లో కరోనా భయం ఇంకా ఉందనడానికి ఇదే నిదర్శనమని రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే యాదవ్ చెప్పుకొచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, దశలవారీగా సాధారణ రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని యాదవ్తో పాటు సీనియర్ రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు.
ప్యాసింజర్ రైళ్లపై ఈ సంవత్సరం రూ.4,600 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ సంవత్సరాంతం లోపు రూ.15,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పలు రైళ్లను నడుపుతున్నట్లు ఆయన వివరించారు. గత సంవత్సరం ప్యాసింజర్ రైళ్లపై రూ.53,000 కోట్ల ఆదాయం వచ్చిందని, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్యాసింజర్ రైళ్లపై ఆదాయం దాదాపు 87 శాతం తగ్గిందని యాదవ్ చెప్పారు.