గత వారం రోజుల నుంచి వాతావరణం సరిగ్గా లేదు. దీంతో ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఓ చోట ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిశాయి. అయితే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అయితే దీని వల్ల ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాంద్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఓ మోస్తరు విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఇప్పటికే గత నాలుగు రోజులుగా ఏపీ తడిసి ముద్దయింది. చాలా చోట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇదే పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సంబంధిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ప్రజలకు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు వేగంగా చేపట్టాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కాగా ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి.