అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసినా ఇంకా అక్కడ సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించినప్పటికీ ట్రంప్ మాత్రం తానే గెలిచానని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. ఇక కొద్ది రోజుల్లోనే అక్కడ అద్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ట్రంప్ గద్దె దిగకపోయినా అధ్యక్షుడి అధికారిక ట్విటర్ ఖాతాను నూతన అధ్యక్షుడు జో బైడెన్కు అప్పగించాలని నిర్ణయించింది. జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఈ ఖాతాను ఆయనకు బదిలీ చేస్తామని స్పష్టం చేసింది. . బైడెన్ బాధ్యతలు స్వీకరించిన రోజే అన్ని అధికారిక ఖాతాల్లోని సమాచారాన్ని సేకరించి వైట్ హౌస్ అధికారులకు అందచేస్తామని తెలిపింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి ఖాతాకు 32 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ట్విటర్ ప్రతినిధి నిక్ పసిలియో మాట్లాడుతూ 2021 జనవరి 20న వైట్ హౌస్ అధికారిక ఖాతాలను బదలాయించేందుకు ట్విటర్ కసరత్తు చేస్తోందన్నారు. 2017లో నాటి నూతన అధ్యక్షుడికి వీటిని బదలాయించినట్టు గానే ఇప్పుడు కూడా నేషనల్ ఆర్కైవ్స్, రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను సంప్రదించి ఈ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. మరి ట్విట్టర్ ప్రకటనపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.