కరోనా వైరస్ వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఎంతో మంది వ్యాపారస్తులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడిప్పుడే పలు రంగాలు మళ్లీ తమ వ్యాపారలు ప్రారంభించాయి. అయితే దేశంలోని ఓ ప్రాంతంలో మాత్రం భారీగా హోటళ్లు మూతపడ్డాయి.
ఇండియా పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది పర్యాటకుల రాకతో ఈ ప్రాంతాలన్నీ ఎప్పుడు కళకళలాడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. హిమాచల్లోని పర్యాటక ప్రాంతం కులూ-మనాలీలో నెల రోజుల క్రితం తెరుచుకున్న హోటళ్లు ఇప్పుడు మళ్లీ మూతబడ్డాయి. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పర్యాటకులు ఇక్కడకు రావడం తగ్గించుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఉంటూ పర్యాటకులకు సేవలు అందిస్తున్నవారు ఆదాయం లేక కష్టాల్లో పడ్డారు.
కులూ జిల్లాలో గడచిన ఎనిమిది నెలల్లో 1,500కు పైగా హోటళ్లు మూడబడ్డాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకూ పరిస్థితి ఇలానే ఉండవచ్చని హోటల్ యజమానులు అంటున్నారు. ఇక్కడ కురుస్తున్న మంచును చూసేందుకు పర్యాటకులు వస్తున్నప్పటికీ వారు ఇక్కడ బస చేసేందుకు ఇష్టపడటం లేదు. ఈ కారణంగా జిల్లాలో మళ్లీ 200 హోటళ్లు మూతబడ్డాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మరో ఆరు నెలల పాటు ఇదే పరిస్థితులు కొనసాగుతాయి.