పాఠశాలల్లో భగవద్గీతను భోదించాలని ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. బ్రహ్మ శంకర్ శాస్త్రి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా భగవద్గీతను సిలబస్లో భాగం చేయాలని బ్రహ్మ శంకర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది.
దీనిపై విచారించిన కోర్టు..బ్రహ్మ శంకర్ పిటిషన్ అస్పష్టంగా, పూర్తి ప్రణాళిక లేకుండా దాఖలు చేసినట్టు ఉందని వ్యాఖ్యానించింది. బ్రహ్మ శంకర్ ముందుగా యూపీకి చెందిన స్కూల్, లేదా కాలేజీ విద్యాశాఖను కానీ లేదా యూనివర్శిటీ అధికారులను కానీ సంప్రదించాలని కోరుతూ ఆయన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ వ్యాజ్యంపై పలు హిందూ సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆయన ఇంకా ముందుకు వెళ్లి అధికారులను సంప్రదించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలె ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యువతుల బలవంతపు మత మార్పిడిని నిరోధించాలన్న లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఈ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపింది. చట్టవిరుద్ధ మతమార్పిడులు, మతాంతర వివాహాలను నిరోధించడమే ఈ ఆర్డినెన్స్ లక్ష్యం. యువతిని ఒక మతం నుంచి వేరొక మతంలోకి మార్చాలన్న ఏకైక లక్ష్యంతో వివాహం చేసుకుంటే, ఆ పెళ్లి చెల్లనిది అవుతుందని ఈ ఆర్డినెన్స్ చెప్తోంది. అయితే ప్రతిపక్షాలు ఈ చర్యలను ఖండించాయి. వ్యక్తిగత స్వేచ్ఛను అతిక్రమించడమేనని ఆరోపిస్తున్నాయి. దేశంలో మతపరమైన విభజనను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నాయి.