కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ప్రత్యేకంగా బయట తిరుగుతున్న వారితో పాటు ఎవ్వరికీ కనిపించకుండా ఉన్న వారికి కూడా కరోనా సోకుతోంది. ఇప్పటికే కొన్ని వందల మంది ఖైదీలకు సోకిన కరోనా తాజాగా పాకిస్తాన్లోని 112 మంది ఖైదీలకు సోకింది. దీంతో అధికారులు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
పాకిస్థాన్ దేశంలోని సింధ్ జైలులో తాజాగా 112 మందికి కరోనా వైరస్ సోకడం కలవరం రేపింది. సింధ్ జైలులో మొదట 31 మంది ఖైదీలకు కరోనా సోకింది. కేవలం 10రోజుల్లో కరోనా సోకిన ఖైదీల సంఖ్య 112 కు పెరిగింది. పదిరోజుల్లో ఖైదీల కుటుంబసభ్యుల ములాఖత్ ల వల్లనే సింధ్ జైలులో ఖైదీలకు కరోనా సోకిందని సింధ్ జైళ్ల శాఖ ఐజీ ఖాజి నజీర్ అహ్మద్ చెప్పారు. కరోనా కలకలంతో సింధ్ జైలుకు వచ్చే కొత్త ఖైదీలను 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతున్నామని జైలు అధికారులు చెప్పారు.
సింధ్ ప్రాంతంలోని 22 జైళ్లలో 18వేలమంది ఖైదీలున్నారు. సింధ్ జైళ్ల కెపాసిటీ 13వేలు కాగా ఎక్కువ మంది ఖైదీలున్నారు. కరాచీలోని మాలీర్ జిల్లా జైలులో 70 కరోనా కేసులు నమోదైనాయి. కరాచీ సెంట్రల్ జైలులో 33 మంది ఖైదీలకు కరోనా సోకింది. పాకిస్థాన్ దేశంలో మొత్తం 4,43,246 మందికి కరోనా సోకగా, వారిలో 8,905 మంది మరణించారు. ఇక భారత్లోని పలు జైళ్లలో కూడా భారీగా కరోనా కేసులు బయటపడిన విషయం తెలిసిందే. వారందరికీ ప్రత్యేకమైన చికిత్స అందించారు.