ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. సభలో వైసీపీ, టిడిపీ మధ్య ప్రతి రోజూ మాటల యుద్ధం నడస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు తమ పేరును నిలబెట్టుకుంటూ అధికార పక్షానికి అడ్డుతగులుతూనే ఉన్నాయి. నేడు సభలో టిడిపి రోజూలాగే ప్రవర్తించిందని మేధావులు అంటున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇవాళ ఉదయం సమావేశం ప్రారంభమవ్వగానే విద్యుత్ సవరణ బిల్లు, అసైన్డ్ భూములు లీజు అంశాలపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే.. ఈ అంశంపై చర్చించడానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి టీడీపీ వాకౌట్చేసింది.
మరోవైపు.. ఏపీ వాల్యుయేటెడ్ ట్యాక్స్ థర్డ్ అసైన్మెంట్ బిల్లును డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రవేశపెట్టారు. అంతకుమునుపు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అలాగే అసైన్డ్ల్యాండ్ బిల్లును డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ప్రవేశపెట్టగా… హోంమంత్రి మేకతోటి సుచరిత దిశ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కీలక బిల్లులపై ప్రస్తుతం శాసనసభలో చర్చ జరుగుతోంది. కాగా సభలో ప్రతి రోజూ తెలుగుదేశం పార్టీ వైఖరి ఏ విధంగా ఉందో అందరూ చూస్తున్నారని వైసీపీ చెబుతోంది. ప్రతిపక్షం తన బాద్యతను నెరవేర్చడంలో విఫలం అవుతుందని అంటున్నారు.