దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ ఆ ప్రాంతానిక వెళ్లే వాళ్లు మాత్రం కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అదేదో మారుమూల ప్రాంతం కాదు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. రైతుల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకిపోతోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీ చేరుకొని ఆందోళనలు చేస్తున్నారు. అయితే నిన్న కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చించినా అవి అసంపూర్తిగానే ముగిసాయి. మరోసారి చర్చలు జరుపుతారని అంతా అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అన్నదాతలు చెప్పిన అంశాలపై చర్చించేందుకు కమిటీ వేస్తామని కేంద్రం చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహంగా ఈ సూచనను తిరస్కరించారు.
ఏడు రోజులుగా చలిని సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో హరియాణా, యూపీల నుంచి ఢిల్లీకి వచ్చే వాహనాల రాకపోకలను పోలీసులు ఆంక్షలు విధించారు. పలు దారులు మూసేసి కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఆందోళన కారంగా పలు రైళ్లు సైతం రద్దయ్యాయి. ఇప్పుడు రహదారులు కూడా మూత పడటంతో అక్కడికి వెళ్లాలనుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల సమస్య కొలిక్కి వచ్చే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగనుంది.