సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఏం జరగబోతోందన్న ఆన్న ఉత్కంఠత నెలకొంది.
వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ చకచకా పనులు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ప్రధానంగా పోటీ పడనున్నట్లు నిన్నటి వరకు ఊహగాణాలు ఉన్నాయి. ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీ స్థాపించి గత సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగిన కమల్ హాసన్.. ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో తమిళ రాజకీయాలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉన్నాయనేది స్పష్టమైంది.
వచ్చే ఏడాదిలో జనవరిలో పార్టీ స్థాపించబోతున్నట్లు సినీ హీరో రజనీకాంత్ చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, ఎవరైనా పార్టీ స్థాపించొచ్చని అన్నారు. ముందు రజనీకాంత్ను పార్టీ స్థాపించనివ్వండి. ముందు వారి రాజకీయ విధివిధానాలేమిటో తెలియాలి. ఆ తర్వాత నేను దానిపై స్పందిస్తానన్నారు. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. తమిళరువి మణియమ్ను ఎందుకు రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారో తెలియడం లేదు’’ అని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. అయితే రజనీ రాజకీయ పార్టీ త్రికూటమిగా నిలబడుతుందా లేదా తెలియాలి. రజనీ ఏ మేరకు ప్రభావం చూపుతారనేది వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.