కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, రాజకీయేతరులు ఈ బంద్కు మద్దతు ప్రకటించారు. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగాలంటే సంస్కరణలు ఎంతో అవసరమని, శతాబ్దాల కింద చేసిన చట్టాలు ప్రస్తుతం భారంగా మారాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ‘ఆగ్రా మెట్రో రాయ్ ప్రాజెక్ట్’ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తుండటం, 8న భారత్ బంద్ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘అభివృద్ధి కావాలంటే సంస్కరణలు అత్యావశ్యకం. నూతన సౌకర్యాలు కల్పించాలన్నా, నూతన నిర్ణయాలు తీసుకోవాలన్నా… సంస్కరణలు కచ్చితం.
గత శతాబ్దపు చట్టాలతో నూతన శతాబ్దాన్ని నిర్మించలేం.’’ అని మోదీ వ్యాఖ్యానించారు. సంస్కరణలనేవి నిరంతరాయంగా జరిగే ప్రక్రియ అని, గత శతాబ్దంలో కొన్ని చట్టాలు ఉపయోగంలో ఉండేవని, కానీ ఈ శతాబ్దానికి అవి భారంగా మారాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సంస్కరణలు కొన్ని రంగాలకు, శాఖలకు మాత్రమే పరిమితమయ్యేవని, కానీ తమ ప్రభుత్వంలో మాత్రం అన్ని రంగాలకూ సంస్కరణలను విస్తరించామని ప్రధాని మోదీ తెలిపారు.