అమెరికా చైనా ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తిపోసుకుంటాయి. ఏ విషయంలోనైనా ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా అమెరికాపై చైనా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. మరి దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
అమెరికా క్షమించరాని ఘోరమైన నేరానికి పాల్పడుతోందని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ తీవ్రంగా మండిపడింది. కరోనా సంక్షోభంలో అమెరికా పీకల్లోతు కూరుకుపోయిందని, అత్యధిక మరణాలు కూడా అమెరికాలోనే సంభవించాయని ఆ పత్రిక ఫైర్ అయ్యింది. ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి, కరోనా నియమాలను పాటించేట్లుగా చేయడంలో ఘోరంగా విఫలమైందని చైనా తీవ్రంగా ధ్వజమెత్తింది. అమెరికాలో 2 లక్షల 88 వేల కరోనా మరణాలు సంభవించాయని, అయినా అమెరికా క్షమించరాని నేరాలకు పాల్పడుతోందని మండిపడింది. డిసెంబర్ మాసం మొదటి ఐదు రోజులలోనే అమెరికాలో 10 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, ప్రతిరోజూ 2 వేలకు పైగా ప్రజలు మరణిస్తున్నారని గ్లోబల్స్ టైమ్స్ పేర్కొంది.
ఈ మారణ హోమం 21వ శతాబ్దంలో మానవత్వానికే పెద్ద అవమానం అని పత్రిక దుయ్యబట్టింది. రానూ రానూ అమెరికాలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముందని ఆ పత్రిక హెచ్చరించింది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా అమెరికా పేరుమోసిందని, అదే దేశం ఇప్పుడు అత్యంత భయానక దేశంగా మారిందని చైనా మండిపడింది. ‘‘భూమిపైనే నరకం’’ చూపిస్తున్న దేశంగా అమెరికా మారుతోందని చైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.