సీనీ రంగం నుంచి నేరుగా రాజకీయాల్లోకి వెళ్లిన వాళ్లు చాలానే ఉన్నారు. వారిలో సక్సెస్ సాధించిన వారు మాత్రం చాలా తక్కువ వారిలోప్రధానంగా గుర్తొచ్చేది ఎన్టీఆర్, జయలలిత.. ఇంకా చాలా మందే ఉన్నప్పటికీ వారంతా ఊహించినంత స్థాయిలో ఎదగలేకపోయారు. ఇప్పుడు మరో స్టార్ రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు ఆయనే సూపర్స్టార్ రజినీకాంత్.
ఇక ఇప్పటికే పార్టీ స్థాపించిన హీరో కమల్ హాసన్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల్ హాసన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలన్నీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా పాగా వేయాలని ఆలోచిస్తున్న బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. కమల్ హాసన్ పార్టీ నుంచి ఓ కీలక నేత బీజేపీ వైపు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మక్కల్ నిధి మయ్యం పార్టీ ప్రధానకార్యదర్శి ఎ అరుణాచలం కమల్ హాసన్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం స్వీకరించారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ సమక్షంలో చెన్నైలో అరుణాచలం బీజేపీలో చేరారు.
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో జరగనున్న నేపథ్యంలో బీజేపీలోకి ఇతరపార్టీల నేతల వలసలు ప్రారంభమయ్యాయి. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నిధి మయ్యం వ్యవహారాల పట్ల అసంతృప్తితోనే అరుణాచలం ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారని టాక్ నడుస్తోంది. అయితే పార్టీలోకి నేతలు రావాల్సిందిపోయి ఉన్న నేత ఇలా వెళ్లిపోవడం ఈ పరిస్థితుల్లో పార్టీకి అంత మంచిది కాదని అంతా అంటున్నారు. ఇది రానున్న రోజుల్లో ఇంకెంతలా మారుతుందో వేచి చూడాలి.