ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉద్యమం తీవ్రతరం అవుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని వ్యతిరేకించిన అమరావతి రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు.
అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరింది. మొదటి నుంచి అమరావతిలో రైతులు, మహిళలు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. దీక్ష శిబిరం ఏర్పాటుచేసుకొని ఆందోళనలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఉద్యమకారులకు ధైర్యాన్ని ఇస్తోంది. అయితే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వై.ఎస్ జగన్ ప్రణాళికా బద్దంగా ముందుకు వెళుతున్నారు.
ఒకే ప్రాంతంలో రాజధాని ఉండటం కంటే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెబుతోంది. ఈమేరకు నిర్ణయం తీసుకొని ముందుకు వెళుతోంది. కానీ అమరావతిలో మాత్రం రైతుల ఆందోళనలు ఆగడం లేదు. 300 రోజుల అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా చంద్రబాబు మాట్లాడుతూ ఉద్యమంలో 92 మంది అమరులయ్యారన్నారు. భూములిచ్చిన రైతులకు ఊరట కలిగించేలా… ప్రభుత్వం నుంచి ఒక్క మాట రాకపోవడం అహంకారపూరితమన్నారు. అమరావతి రైతులకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు.
అమరావతిలో 300 రోజుల పాటు రైతులు ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు ఎన్ని రోజులు ఉద్యమంలో పాల్గొన్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్లు హైదరాబాద్లో ఉండి అమరావతిలో ఉద్యమం గురించి కామెంట్లు చేయడం తప్ప ఉద్యమంలో వారు పాల్గొనింది లేదని అంటున్నారు.