ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది కొద్ది ప్రాంతాల్లో మాత్రమే. మరికొన్ని చోట్ల కేసుల సంఖ్య తగ్గుతూనే ఉంది. ఇక రికవరీల్లో భారత్ మంచి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లో రికవరీల్లో భారత్దే అగ్రస్థానం.
కరోనా వ్యాక్సిన్ రాకముందే భారత్లో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇండియాలో మొత్తం 92 శాతం రికవరీ రేటు ఉంది. అయితే సెకండ్ వేవ్ పైనే అందరూ ఆందోళనగా ఉన్నారు. మరో నెల రోజుల్లోపే దేశంలో కరోనా సెకండ్ వేవ్ వస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదొక్కటే ఆందోళన కలిగించే అంశం. దేశరాజధాని ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఉపశమనం కలిగించే అంశంగా మారింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వరుసగా 51 వ రోజు కూడా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబరు 17 తరువాత నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 5.11 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 2.57 లక్షల కేసులు మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. కాగా మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు దిగువకు చేరింది. దేశంలో శనివారం కొత్తగా 46,153 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మొత్తం 48,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85.07 లక్షలకు చేరుకుంది. 78.67 లక్షల మంది కోలుకున్నారు. 1.26 లక్షల మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. కాగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పై దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ వస్తే ఏ విధంగా పంపిణీ చేయాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.