ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ పరిస్థితుల్లో పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ అనుమతులు ఇచ్చేసి అత్యవసర వ్యాక్సిన్ పొందుతున్నాయి. అన్ని దేశాల కంటే ముందే రష్యా వ్యాక్సిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టీ అమెరికా, భారత్ వైపే ఉంది.
కరోనా వాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా తొలి వ్యాక్సిన్ స్పుత్నిక్-వి పేరుతో రిజిష్టర్ చేసింది. ఇక భారత్లోనూ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రా జెనెకాతో పాటు స్వదేశీ వ్యాక్సిన్ల ప్రయోగాలు తుదిదశకు చేరుకున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా ముమ్మరం చేసింది. పుణె నగరంలోని నోబెల్ ఆస్పత్రిలో వాటి ప్రయోగాలను ప్రారంభించారు.
మూడు రోజులుగా 17 మంది వాలాంటీర్లకు కోవిడ్ వ్యాక్సిన్ అందించిన అధికారులు వారి ఆరోగ్యాన్ని ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండోదశ ప్రయోగాలు జరుగుతున్నాయి. రెండోదశలోనూ వాలంటీర్లకు రెండు డోసుల వ్యాక్సిన్ను అందించనున్నారు. భారత్లో ఏదైన వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలంటే.. వ్యాక్సిన్కు సంబంధించి రెండు, మూడో దశ ప్రయోగాలను ఇక్కడ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్తోపాటు స్పుత్నిక్-వి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారత్లో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రయోగాల తర్వాత పది కోట్ల డోసులను భారత్లో సరఫరా చేసేందుకు ఆర్డీఐస్తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. మరోసంస్థ హెటెరోతోనూ ఏటా పది కోట్ల డోసుల ఉత్పత్తికి స్పుత్నిక్ ఒప్పందం చేసుకుంది. రష్యాలో ఇప్పటికే వేలమందిపై ప్రయోగించారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల విశ్లేషణలో వ్యాక్సిన్ దాదాపు 92 శాతానికిపైగా సమర్థత కలిగినట్లు రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది.