కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రైతులు దీనిపై ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ నగరం రైతుల ఆందోళనలతో అట్టడుకుతోంది. కాగా రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చారు.
భారత్ బంద్ కార్యక్రమాన్ని ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. తమ బంద్ ద్వారా సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము బంద్ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తామని, తమ తమ విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని, ఆ తర్వాత 3 గంటలకు బంద్ను ముగిస్తామని, ఆ సమయంలో కార్యాలయాలు కూడా ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు.
అత్యవసర సర్వీసులైన అంబులెన్స్లు, పెళ్లిళ్లు యథావిథిగానే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. తమ నిరసనను శాంతియుతంగా కొనసాగిస్తామని, తమ నిరసన వ్యక్తం చేయడానికి దీనిని ఓ పద్ధతిగా మాత్రమే ఎంచుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన విధానాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమన్న సంకేతాలను ఇవ్వడానికే దీనిని నిర్వహిస్తున్నట్లు రాకేశ్ టికాయత్ తెలిపారు. బంద్ సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.