ప్రపంచ దేశాలను ఇంకా కరోనా భయపెడుతూనే ఉంది. వేలాది మంది ప్రజలు కరోనాతో చనిపోతున్నారు. తాజాగా ఓ దేశ ప్రధాని కరోనా సోకడంతో మృతి చెందారు. కరోనాను తక్కువగా అంచనా వేస్తున్న వారందరికీ ఇది ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు.
ఎస్వతిని అనే చిన్న దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ డ్లమిని (52) కొవిడ్-19తో చికిత్స పొందుతూ మరణించారు. చిన్న సంపూర్ణ రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎస్వతిని దేశంలో ప్రధానమంత్రి అంబ్రోస్ డ్లమిని కరోనాతో దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఎస్వతిని దేశ ఉప ప్రధాని తెంబా మసుకు చెప్పారు. కొవిడ్-19 నుంచి కోలుకోవడానికి వీలుగా అంబ్రోస్ ను దక్షిణాఫ్రికాకు తరలించినా, చికిత్స పొందుతూ మరణించాడని ఉప ప్రధాని తెంబా చెప్పారు. అంబ్రోస్ 2018 నవంబరులో ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. 2018లో పోలాండులోని కటోవిస్ నగరంలో జరిగిన ప్రపంచ దేశాల సమావేశంలో వాతావరణ మార్పులపై అంబ్రోస్ డ్లమిని మాట్లాడారు.
ఇక ఇండియాలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ నగరంలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఉద్యోగులకు కొవిడ్ -19 పాజిటివ్ అని తేలడంతో ముందుజాగ్రత్తగా రెండు వారాల పాటు ఆలయాన్ని మూసివేశారు. గురువాయూర్ ఆలయంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా కరోనా ప్రబలకుండా గురువాయూర్ దేవస్థానాన్ని రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వహణ కమిటీ ప్రకటించింది. గతంలో ప్రభుత్వం సూచించిన కొవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం భక్తులకు గురువాయూర్ ఆలయంలో ప్రవేశ అనుమతి ఉండేది.
శబరిమల తీర్థయాత్రలు ప్రారంభమైన నేపథ్యంలో గురువాయూర్ దేవాలయంలో ఆన్లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు. భక్తుల రాకుండా గురువాయూర్ ఆలయాన్ని మూసివేసినా, ఈ సమయంలో పూజారులు మాత్రం ఆలయంలో క్రమం తప్పకుండా పూజలు చేస్తారని ఆలయ అధికారులు చెప్పారు. కేరళ రాష్ట్రంలో ఒక్క ఆదివారం 4,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో క్రియాశీల కరోనా కేసుల సంఖ్య 59,438 గా నమోదైంది.