ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆదాయం పెరిగింది. మోదీ నెలకు రూ. 2 లక్షల జీతం తీసుకుంటున్నారు. దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారు. దీని ద్వారా వచ్చే వడ్డీతో ఆయన పెట్టుబడులు పెడుతుండటం వల్ల ఆయన ఆదాయం పెరుగుతోందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నికర ఆస్తుల విలువ గత యేడాదితో పోలిస్తే.. ఈ యేడాది పెరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. 2019 జూన్తో పోల్చితే ఈ జూన్ నెలకు మోదీ నికర ఆస్తుల విలువ 36 లక్షల రూపాయలు పెరిగి రూ. 2.85 కోట్లకు చేరుకుంది.
గత యేడాది ఆయన చేసిన బ్యాంక్ డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్స్ కారణంగా ఆస్తుల విలువ పెరిగినట్టు పీఎంవో పేర్కొంది. ఇక ఈ ఏడాది జూన్ నాటికి మోదీ చేతిలో కేవలం 31,450 రూపాయలు మాత్రమే ఉండగా, గుజరాత్లోని గాంధీనగర్ ఎస్బీఐ బ్రాంచీలో బ్యాంక్ బ్యాలెన్స్ 3,38,173 రూపాయలున్నాయి. ఇదే బ్రాంచీలో రూ.1,60,28,939 ఎఫ్డీఆర్, ఎంఓడీ బ్యాలెన్స్ ఉంది. అంతేకాకుండా రూ.8,43,124 విలువ గల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్(ఎన్ఎస్సీ), రూ. 1,50,957 విలువ చేసే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, రూ. 20 వేలు విలువ చేసే ట్యాక్స్ సేవింగ్ ఇన్ఫ్రా బాండ్స్ కలిగి ఉన్నారు. వీటితో పాటు స్థిరాస్తులు రూ. 1.75 కోట్లకు పైగా ఉన్నాయి.
కాగా ఇప్పటి వరకు మోదీ ఎలాంటి రుణం తీసుకోలేదు. ఆయన పేరు మీద ఎలాంటి వాహనం కూడా లేదు. అయితే రూ. 1.5 లక్షలు విలువ చేసే 45 గ్రాముల బరువు గల నాలుగు ఉంగరాలు ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి 2004లో ఈ ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో రాజకీయ నాయకులు తమ ఆస్తులు, అప్పుల వివరాలు బయటపెడుతూ వస్తున్నారు.