కరోనా వైరస్ అందరినీ భయపెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్తో యూకేలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు యూకేతో సంబంధాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే విమానయాన సర్వీసులను రద్దు చేశాయి.
కాగా ఇప్పటికే యూకే నుంచి భారత్కు పలువురు వచ్చినట్లు తెలుస్తోంది. కర్నాటకలో ఈ వైరస్పై సమావేశం కూడా నిర్వహించారు. నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ వెల్లడించారు. యూకే నుంచి ఆదివారం కర్ణాటకకు 291 మంది బ్రిటీష్ ఎయిర్వేస్లో వచ్చారని, 246 మంది ఎయిర్ ఇండియాలో వచ్చారని, 138 మంది నెగటివ్ నివేదికలతో రాలేదన్నారు. వీరందరినీ వారం రోజుల పాటు హోం క్వారంటైన్లోనే ఉంచి నిఘా పెట్టామన్నారు. విమానాశ్రయంలో కియోస్క్లు అమర్చామన్నారు. వైరస్ వేగవంతంగా ప్రబలుతుందని, అయితే రోగతీవ్రత ఉండదని.. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఇప్పటికే కొందరు సిద్ధమైనట్లు తెలుస్తోందని, ప్రత్యేకించి హోటళ్ల బుకింగ్ చేసుకున్నా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గడిచిన 14 రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారంతా ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయించుకోవాలని ఆయన సూచించారు. హోం క్వారంటైన్ను ఉల్లంఘించినా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం రాత్రి నుంచి యూకే నుంచి వచ్చే విమానాలను నిషేధించారు.