పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశ వ్యాప్తంగ ఆసక్తిగా మారాయి. బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్షా బెంగాల్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీకి చెందిన ఎంపీ భార్య టీఎంసీలో చేరారు.
పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ స్వగత రాయ్ సమక్షంలో టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా.. తన భర్త బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ టీఎంసీలో చేరడంపై ఆమె స్పందించారు. కుటుంబం, రాజకీయాలు ఎప్పుడూ ఒకే ప్లాట్ఫాంపై ఉండవని, ప్రస్తుతానికి ఇది తన నిర్ణయమని, భవిషత్య్లో సౌమిత్ర ఖాన్ టీఎంసీలో చేరరని గ్యారెంటీ ఇవ్వగలరా..? అని సుజాత ప్రశ్నించడం విశేషం. కాగా తన భర్త బీజేపీ ఎంపీగా ఉండగా.. ఈమె టీఎంసీలో చేరడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
దీనిపై ఎంపీ సౌమిత్ర ఖాన్ స్పందించారు. టీఎంసీలో చేరడంతో భార్య సుజాతకు విడాకుల నోటీసు పంపేందుకు సౌమిత్ర ఖాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సౌమిత్ర ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఆమె బీజేపీని వదిలి టీఎంసీలో చేరి చాలా పెద్ద తప్పు చేసిందని, తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని చెప్పారు. తన ఇంటి పేరైన ‘ఖాన్’ను కూడా పేరు చివర తొలగించుకోవాలని బెంగాల్ బీజేపీ యువమోర్చాకు కూడా అధ్యక్షుడైన సౌమిత్ర ఖాన్ తన భార్యకు సూచించారు. అధికార టీఎంసీ తమను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేసిందని, ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. తన వేతనంలో 50 శాతం ప్రతి నెలా భార్య ఖాతాకు పంపిస్తానని ఆమెకు మాటిచ్చానని, ఇకపై ఆ భాగం గురించి అడగవద్దని సౌమిత్ర ఖాన్ తన భార్యకు స్పష్టం చేయడం కొసమెరుపు.