కరోనా మహమ్మారి బారిన పడిన ప్రజలను కాపాడుతున్న వైద్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా 515 మంది వైద్యులు కరోనాతో చనిపోయారు. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందించి చనిపోయిన వారే అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో వైద్యుల సేవలు వెలకట్టలేనివి. అయితే వీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనా రోగుల వద్దకు వెళ్లినా ఏదో ఒక రూపంలో కరోనా మహమ్మారి వైద్యులకు కూడా సోకుతోంది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు వారు 201 మంది వైద్యులు చనిపోయారు. 50 నుంచి 60 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న వారు 171 మంది చనిపోయారు. 70 ఏళ్లు పైబడిన వారు 66 మంది వైద్యులు కరోనాతో ప్రాణాలు విడిచారు. 35 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు వారు 59 మంది ఉన్నారు.
18 మంది వైద్యులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు ఉన్నారు. వీరంతా కరోనా పేషెంట్లకు చికిత్స చేసిన వారే. మృతి చెందిన ఈ వైద్యుల్లో సగం మందికే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించినట్లు తెలుస్తోంది. వీరిని వివిధ ఐఎంఏ శాఖల ద్వారా గుర్తించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. అయితే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. విధి నిర్వహణలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలపడానికి తమ వద్ద తగినంత డేటా లేదని కేంద్రం చెబుతోంది. ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, అందువల్ల కేంద్రం అటువంటి డేటా బేస్ను నిర్వహించలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఇటీవల పార్లమెంటులో వెల్లడించారు.