మామూలుగా పండుగలు వస్తున్నాయంటే అన్ని చార్జీలు పెరుగుతాయి. బస్సు, రైలు, విమానం ఇలా అన్నీ రేట్లు పెంచుతారు. కానీ ఇప్పుడు కరోనా పుణ్యమా అని చార్జీలు తగ్గించే పనిలో ఉన్నారు. దీపావళి సందర్బంగా విమానం ఎక్కేవారికి ప్రయాణ చార్జీ భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా నేపథ్యంలో ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దీపావళి పండుగను పురస్కరించుకొని తక్కువ చార్జీతో విమాన ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం బెంగుళూరుకు రూ.2 వేలు, హైదరాబాద్కు రూ.2,400 చార్జీతో ప్రయాణించవచ్చు. లాక్డౌన్ కారణంగా అంతర్జాతీయ విమాన సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. అంతర్ రాష్ట్రాల మధ్య మాత్ర మే విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుంచి ప్రతిరోజు 133 విమానాలు వివిధ నగరాలకు నడుపుతున్నారు. లాక్డౌన్ సడలింపులతో ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది.
కరోనా భీతి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో, వారిని ప్రోత్సహించేలా విమాన చార్జీలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం చెన్నై నుంచి బెంగుళూరు వెళ్లేందుకు రూ.1,700 నుంచి రూ.2 వేల వరకు, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు రూ.2,400 నుంచి రూ.2,800 వరకు, ఢిల్లీకి రూ.4 వేలు చార్జీగా నిర్ణయించారు. ఈ విషయమై ట్రావెలింగ్ ఏజెన్సీ నిర్వాహకులు మాట్లాడుతూ, గత ఏడాది పోలిస్తే 30 నుంచి 40 శాతం మేర చార్జీలు తగ్గాయని పేర్కొన్నారు. మొత్తానికి విదేశాలకు వెళ్లకపోయినా స్వదేశంలో తిరగాలనుకునే వారికి ఈ ఆఫర్ బాగానే ఉపయోగపడుతుంది.