దేశ వ్యాప్తంగా అందరి చూపు బీహార్ ఎన్నికల వైపే ఉంది. కరోనా విజృంభణ తర్వాత పెద్ద ఎన్నికలు బీహార్లోనే జరుగుతున్నాయి. మొత్తం మూడు విడుతల్లో జరుగనున్న ఈ ఎన్నికల్లో భాగంగా నేడు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నేడు 71 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈవీఎంల్ను శానిటైజ్ చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాలు దాటిన వృద్దులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
71 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 952 మంది పురుషులు, 114 మంది మహిళలు పోటీలో ఉన్నారు. అత్యధికంగా గయా అసెంబ్లీ స్థానానికి 27 మంది పోటీలో ఉన్నారు. ఇక నేటి పోలింగ్లో దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని ముగించాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఈ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. ఏ పార్టీ వైపు ప్రజల మనసు ఉంటుందో ఈ ఎన్నికలతో రుజువు అవుతుందన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. ఇక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది.