కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఓ బాదిత యువతి కుటుంబ సభ్యలను పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంక దుస్తులను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో బాదితురాలి కుటుంబ సభ్యులను కలవడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వెళ్లిన విషయం తెలిసిందే. అంతకుమందు వారిని నోయిడా హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హైవేపై ఆందోళనకు దిగారు. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయబోయారు. దీంతో అక్కడే ఉన్న ప్రియాంకా గాంధీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు ఆమె దుస్తులు పట్టుకున్నారు.
ఆ తర్వాత చాలా సేపటికి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. మహిళా నాయకురాలి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు ఇదేనా అంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రియాంకా గాంధీ దుస్తులు పట్టుకొని ఆమెను ఆపాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. భారతీయ సంస్కృతిని విశ్వసించే ముఖ్యమంత్రే అయితే, అలా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదిఏమైనా మహిళా నాయకురాలిపై పోలీసులు ఇలా ప్రవర్తించడం కరెక్టు కాదన్నది అందరి అభిప్రాయం.