దేశ రాజకీయాల్లో రోజుకో సంచలనం జరుగుతోంది. భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన మోడీ సర్కార్ తక్కువ సమయంలోనే మిత్ర పక్షాలను దూరం చేసుకుంటోంది. ఇప్పటికే శివసేన, అకాలీదళ్ పార్టీలు దూరమైన ఎన్డీయేకు తాజాగా లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) దూరమైంది.
బీహార్లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఎల్జేపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ తెలిపారు. నితీష్ కుమార్ నేతృత్వంలో పనిచేసేందుకు ఇష్టపడని వీళ్లు ఎన్డీయే నుంచి బయటకు రావాలనే నిర్ణయించుకున్నారు. అయితే బీజేపీతో మాత్రం తమ పొత్తు కొనసాగుతుందని తెలిపారు.
బీహార్లో రానున్న ఎన్నికల్లో జేడీయూపై పోటీ చేయాలని ఎల్జేపీ తీర్మానించింది. అయితే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం పోటీ చేయబోదని ఆ పార్టీ తెలిపింది. దీంతో ఈ తెగతెంపులు కేవలం నితిష్ కుమార్తోనేనా లేకుంటే రానున్న రోజుల్లో బీజేపీతో కూడా ఉంటుందా అన్నది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అంతా కలిసి ఉండి ఇప్పుడు జేడీయూ నచ్చదు కాబట్టి కూటమి నుంచి బయటకు రావడం ఎంతవరకు దారితీస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మొన్ననే పార్లమెంటో వ్యవసాయ బిల్లుల సందర్బంగా అకాలీదళ్ ఎన్డీయేను కాదని బయటకు వచ్చేసింది. ఇప్పుడు మరో పార్టీ బయటకు వచ్చనా బీజేపీతో కలిసి ఉంటామని చెబుతోంది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం బీజేపీకి ఇలాంటివన్నీ మైనస్ అవుతాయని అంటున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఎలా ముందుకెళుతుందో వేచి చూడాలి.