ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను తప్పించి.. సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు రాష్ట్ర కమిటీలో కూడా మార్పులు చేస్తూ సోము ప్రకటించారు.
సోము ప్రకటించిన రాష్ట్ర కమిటీలో తనదైన శైలిలో మార్పులు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మొన్నటి వరకు 70 మందితో కూడిన జంబో కార్యవర్గం ఉండేది. ఇప్పుడు దాన్ని 40 మందితోనే భర్తీ చేశారు. కాగా అధికార ప్రతినిధుల విషయంలో కూడా మార్పులు చేశారు. 21 మంది అధికార ప్రతినిధులు ఉండగా.. ఇప్పుడు ఏడుగురినే ఎంపిక చేశారు. దీంతో సోము వీర్రాజు చేసిన మార్పులపై ఆశావహులు గుర్రుగా ఉన్నారు. కన్నా, పురందేశ్వరి వర్గాలకు కూడా ప్రధాన్యత దక్కలేదని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి తగిన అవకాశం రాలేదు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వారికి నూతన కార్యవర్గం ఏమాత్రం రుచించడం లేదని పొలిటికల్ డిస్కషన్ నడుస్తోంది.
వరదాపురం సూరి, సాధిని యామినేని, లంకా దినకర్లాంటి అనేక మంది నేతలు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కోసం ఎంతగానో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే సోము మాత్రం చాకచక్యంగా కమిటీ వేశారు. కాగా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండేందుకు తాపత్రయపడే కొందరు నేతలకు అవకాశం రాకపోవడంతో డైలమాలో పడ్డారంట. ఇక సోము వీర్రాజు తన అనుచరులకే కార్యవర్గంలో చోటు కల్పించారు. ఎమ్మెల్సీ మాధవ్తో పాటు, విష్ణువర్ధన్రెడ్డి, విష్ణుకుమార్ రాజు అవకాశం ఇచ్చారు. రేలంగి శ్రీదేవి, వేటుకూరు సూర్యనారాయణరాజులకు కీలక పదవులు ఇచ్చారు. ప్రధానంగా ఆర్.ఎస్.ఎస్ నేపథ్యం ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది.