అంతర్జాతీయ క్రికెట్కు ఇటీవల గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోని, డ్యాషింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అభిమానులు కొట్టుకున్నారన్న వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఆదిపత్య పోరు ఈ గొడవకు దారి తీసిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ధోని, రోహిత్ అభిమానుల గొడవ పట్ల మాజీ క్రికెటర్ వీరేంద్ర సేహ్వాగ్ స్పందించారు. ఇలా అభిమానులు గొడవలు పడొద్దని చెప్పారు. టీం ఇండియా అంటే అందరూ ఒక్కటే అన్నారు. అయితే ఇటీవల మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ వివాదం చెలరేగింది. ధోని రిటైర్మెంట్ అయిన సందర్బంగా ఆయన అభిమానులు పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం రావడంతో రోహిత్ అభిమానులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే రోహిత్ ఫ్లెక్సీలను కొందరు చింపేశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే ఈ ఘర్షణల్లో భాగంగా రోహిత్ అభిమానిని ధోని అభిమానులు పొలాల్లోకి తీసుకెళ్లి కొట్టినట్లు తెలుస్తోంది. ఈ వివాదం విషయంలో సెహ్వాగ్ జోక్యం చేసుకున్నారు. అభిమానులు ఎప్పటికీ గొడవ పడొద్దన్నారు. క్రికెటర్లు అందరితో మంచిగా ఉంటారని.. ఫ్యాన్సు గొడవ పడకూడదని సూచించారు. మరి ఈ ఫ్యాన్స్ ఘర్షణపై ధోని, రోహిత్ ఒకసారి స్పందిస్తే బాగుంటుందని పలువురు అభిమానులు కోరుతున్నారు.