సమాజంలో గొడవలకు అంతే లేదు. ఏ చిన్న విషయంలో అయినా చిన్నగా మొదలయ్యే వివాదం పెద్దది కావడం మనం చూస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ప్రాణం తీసే వరకు వెళ్లింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన రూపేశ్ అనే వ్యక్తి బార్బర్ షాప్కు వెళ్లారు. అక్కడ కటింగో షేవింగో చేపించుకొని డబ్బులు ఇవ్వాల్సి రావడంతోనే గొడవ మొదలైంది. బార్బర్ షాప్ వ్యక్తికి యాబై రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రూ. 30 మాత్రమే ఇచ్చాడు రూపేష్. అదేంటని అడగ్గా ఇరవై రూపాయలు మళ్లీ ఇస్తానని చెప్పాడు. దీంతో షాపుకు సంబంధించిన సంతోష్ అతని తమ్ముడు సరోజ్లు అన్ని డబ్బులు ఇచ్చి బయటకు వెళ్లాలని చెప్పారు. ఎంత చెప్పినా వినకపోవడంతో రూపేష్ను వీళ్లు కొట్టారు. రూపేష్కు తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే కోలుకోలేక అతడు మృతిచెందారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరవై రూపాయల దగ్గర వచ్చిన గొడవ చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లిందని స్థానికులు అంటున్నారు. ఏ ఒక్కరు సర్దుకొని వెళ్లినా ఇంత ఘోరం జరగేది కాదని విషయం తెలిసిన వారంతా జాలి చూపిస్తున్నారు.