ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరకున్న ఆయన నేడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటి ముగిసిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాల్గొంటారు. ఇందుకోసం తగిన ప్రణాళికతోనే జగన్ ఢిల్లీలో అడుగు పెట్టారు.
జగన్ ఢిల్లీ టూర్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10.40 గంటలకు జగన్ ప్రధాని మోఢీతో సమావేశం అవ్వనున్నారు. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఏపీకి సంబంధించిన అన్ని విషయాలపై జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఏపీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన సహకారం పై కూడా క్లారిటీగా మాట్లాడే అవకాశం ఉంది. ఇక మూడు రాజధానుల అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే పోలవరం నిధులకు సంబంధించి కేంద్ర మంత్రులను కలిసిన విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తుంది.
అమరావతి భూ కుంభకోణం కేసు సీబీఐ విచారణకు ఇవ్వాలన్న ప్రస్తావన కూడా మోదీతో చర్చలో జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. హైకోర్టు విషయంలో ఎదురవుతున్న పరిస్థితిపై కూడా మాట్లాడతారని తెలుస్తోంది. మొత్తం మీద ఏపీకి సంబంధించిన అన్ని విషయాలు ప్రస్తావించడమే కాకుండా ప్రత్యేకంగా సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు. వాలంటీర్ల వ్యవస్థతో పాటు, గ్రామ వార్డు సచివాలయాల పనితీరును ప్రస్తావించనున్నారు. ఈ విషయాలన్నీ చర్చించేందుకు తగిస సమయం ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల మోదీ జగన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో జగన్ అనుకున్నంత సేపు మోదీతో మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు. పైగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం 12 గంటలకు ఉంది. ఈలోపే జగన్ అన్నీ మాట్లాడుకోవచ్చు.
ఇక మరో హాట్ టాపిక్ ఏపీలో నడుస్తోంది. ఎన్డీయేలోకి వైసీపీని తీసుకోవాలని మోదీ అనుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగనుందో తెలియాల్సి ఉంది. జగన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో సమర్థవంతమైన, నమ్మకమైన వ్యక్తిగా మోదీ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసమే జగన్ను ఎన్డీయేలో కలుపుకోవాలని అనుకుంటున్నారని టాక్. మరి ఈ విషయంలో ఏమైనా జరగొచ్చని తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా అటు మోడీ, ఇటు జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం జరిగినా ఇద్దరికీ మంచే జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. ఏపీ ప్రయోజనాల కోసం జగన్ ఏం చేసేందుకైనా సిద్ధమే అన్న మాటలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయి.