కరోనా ఓ నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. అన్యోన్యంగా ఉన్న వారి జీవితాన్ని కకావికలంగా మార్చేసింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన నరసింహారావు సునీత దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగాలు చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే ఓ వారం రోజుల క్రితం నరసింహారావుకు కాస్త జ్వరంగా ఉంటే వైద్యుని వద్ద చూపించుకున్నారు. శ్వాసలో ఇబ్బందులు రావడంతో రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రిలో చేరారు. స్కానింగ్ చేసిన తర్వాత కరోనా సోకిందని తేలడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ 16వ తేదీ మరణించారు.
నరసింహారావు మృతిచెందడంతో ఆయన భార్య, కొడుకు, కూతురు తీవ్ర మనోవేధనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు వీరి కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేది. అలాంటిది ఒక్కసారిగా ఇలా కరోనాతో ఆయన చనిపోవడంతో పరామర్శించేందుకు కూడా బంధువులు ఎవ్వరూ రాలేదని తెలిసింది. ఈ మనోవేధనతో ఉన్న వీరంతా ఇక బ్రతికడమెందుకని డిసైడయ్యారు. మంగళవారం అర్దరాత్రి 11 గంటలకు ఊరి నుంచి కారులో బయలుదేరి ఊరి బయట గోదారిలో పడి చనిపోయారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్క నరసింహారావుకు తప్ప ఎవ్వరికీ కరోనా రాలేదు. వీరంతా పరీక్షించుకుంటే నెగిటివ్ అని వచ్చింది. అయితే తండ్రి లేరన్న బాధతో పిల్లలు, భర్త దూరమయ్యాడన్న మనోవేధనతో భార్య అందరూ తనువుచాలించాలని డిసైడ్ అయ్యారు. నరసింహారావు కోసం ముగ్గురు ఆత్మహత్యచేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న వారంతా వీరి కుటుంబం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.