రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం వంద సార్లు చెప్పినా ఒక్క సారి చెప్పినట్టే అంటోంది. ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర రాజధాని అంశం విషయంలో తమ వైఖరి మారదని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక విషయం ఆ రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని విషయంలో అమరావతి జేఏసీ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీన్ని విచారిస్తున్న ధర్మాసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశమనేది ఆ యా రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని అఫిడవిట్లో స్పష్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెబుతున్న వారికంతా రెండో సారి కేంద్రం వివరించినట్లు అయ్యింది. ఇప్పటికే రాష్ట్ర రాజధాని విషయంలో ఏపీ గవర్నమెంట్ క్లారిటీతో ఉంది. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఇక విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన చేయడమే మిగిలింది.
అయినప్పటికీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చెబుతున్న ప్రతిపక్ష పార్టీలకు కేంద్రం ఒక్కసారి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఒకే మాట అన్నట్లు క్లారిటీ ఇచ్చిందని చెప్పొచ్చు. మరి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే అమరావతిలో రైతులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు మీకు మేమున్నామని చెబుతూ ఆందోళనలు కొనసాగేలా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంకి మద్దతుగా మూడు రాజధానులను అంగీకరిస్తారా లేక ఇలాగే పోరాటం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.