వైకాపా ప్రభుత్వం అవినీతిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇళ్లపట్టాల అవినీతి విషయంలో అధికార పార్టీ కొత్త తరహా అక్రమాలకు తెరలేపిందన్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు.
రాష్ట్రంలో ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరించిన అధికార పార్టీ వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని చంద్రబాబు అన్నారు. ఏమాత్రం నిర్మాణాలకు అనువుగాని భూములు ప్రభుత్వం సేకరించిందన్నారు. చౌక ధర పలికే భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతోందన్నారు.
వరదలు వస్తే మునిగిపోయే ఆవ భూములు 600 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సేకరించింది. ఈ భూముల కోసం రూ. 270 కోట్లు ఖర్చు చేసింది. ఒక ఎకరా భూమి రూ. 45 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఈ మేరకు చంద్రబాబు దీనిపై వివరంగా సీఎస్కు లేఖలో పేర్కొన్నారు. ఈ భూములు నిర్మాణాలకు ఏమాత్రం పనికి రావన్నారు. అలాంటి ఈభూముల కోసం ఇప్పటికే రూ. 270 కోట్ల ఖర్చు చేశారని.. మళ్లీ ఈ భూములు మెరక చేయడానికి మరో రూ. 250 కోట్లు ఖర్చు అవుతాయన్నారు.
కేవలం అక్రమాలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భూములు అన్ని ప్రాంతాల్లో కొనుగోలు చేశారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన సీఎస్ను కోరారు. ఈ మేరకు వరద నీటిలో మునిగిపోయిన ఆవ భూములకు సంబంధించిన వివరాలు అందజేసినట్లు చంద్రబాబు తెలిపారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నివాసాలకు ఆమోదయోగ్యం కాని భూములను ఎలా ఇళ్ల పట్టాలు ఇస్తారన్నది ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పి ప్రజల భయాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.