మానవత్వం మంట కలుస్తోంది. పరిస్థితులు ఎలాగున్నా దోచుకోవడమే మాకు తెలుసు అన్నట్లు పలువురు ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా పలువురు చేస్తున్న పనులు తెలిస్తే మనం ఎలాంటి మనుషుల మధ్య ఉన్నామో తెలుస్తుంది.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కరోనా దోపిడీ కథ గురించి. కొందరు చెప్పిన వివరాల ప్రకారం ఈ అంశాన్ని బహిర్గతం చేయడం జరుగుతోంది.
ఈ నెల 14వ తేదీన సాయినాథ రావు అనే వ్యక్తి ఛాతి నొప్పితో అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆయన్ను హాస్పిటల్కు తీసుకొని వచ్చేలోపే చనిపోయాడు. విషయం తెలుసుకున్న అంబులెన్స డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులు సాయినాథరావు కరోనాతో చనిపోయారని అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వాలని అతని కుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియాలో ఉన్న మృతుడి కుమారుడికి ఫోన్ చేసి అర్జెంటుగా మీ నాన్న గారి అత్యక్రియలు నిర్వహించాలని వెంటనే రూ. 85 వేలు కట్టాలని అడిగారు. పట్టుబట్టి ఆయనతో రూ. 50 వేలు వేయించుకున్నారు. బాదితుడి భార్యతో మరో రూ. 35 వేలు ఇప్పించుకున్నారు.
అయితే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న కుటుంబ సభ్యులు చూసి షాక్ అయ్యారు. అందులో కార్డియాక్ అరెస్ట్(బ్రాట్ డెత్) అని వైద్యులు పేర్కొన్నట్లు తెలిసుకున్నారు. తమ తండ్రి కరోనాతో చనిపోకపోయినా అబద్దాలు చెప్పి డబ్బులు వసూలు చేశారని.. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జరిగిన తీరు చూస్తుంటే ఇప్పుడు సంభవిస్తున్న మరణాల్లో ఎంత మంది కరోనాతో చనిపోతున్నారో లేదా డబ్బుల కోసం సిబ్బంది ఇలా చేస్తున్నారో తెలియడం లేదు.