కరోనా కేసులు పెరుగుతున్నా పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే ఒక్క వారంలో అక్కడ 4 వేల పెళ్లిళ్లు జరుగనున్నట్లు తెలుస్తోంది. కార్తీక మాసంలో సుముహూర్తాలు ఉండటంతో నవంబర్ 30 వరకూ దేశవ్యాప్తంగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. జైపూర్లో నవంబర్ 30 వరకూ 4,000 వివాహాలు జరగనున్నట్లు తెలిసింది. నవంబర్ 27, 30వ తేదీల్లో.. ఈ మూడు రోజుల్లో జైపూర్లో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.
రాజస్థాన్లో గత నాలుగు రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 1.34 శాతం పెరిగింది. రాజస్థాన్లో రోజుకు 3వేల కరోనా కేసులు నమోదవుతుండగా, ఒక్క జైపూర్లోనే రోజుకు 600కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోయినప్పటికీ రాజస్థాన్లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరుగుతుండటం గమనార్హం. రాజస్థాన్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 26,000. జైపూర్లో కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూతో పాటు మరిన్ని చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వివాహాలు జరుగుతుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జైపూర్కు చెందిన వధువు నిహారిక సింగ్ మాట్లాడుతూ… తన పెళ్లికి చాలా మంది స్నేహితులు, మరీ ముఖ్యంగా ఇతర దేశాల్లో స్థిరపడిన స్నేహితులెవరూ వచ్చే పరిస్థితి లేదని.. ఇది కొంత బాధగా ఉన్నప్పటికీ తక్కువ మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకోవడమే ఈ సమయంలో మేలని తెలిపింది. పెళ్లి వేడుకకు 100 మందికి మించి హాజరుకాకూడదని, పెళ్లిళ్లకు హాజరయ్యే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే నిబంధన పెట్టింది.