బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కరోనా వైరస్ కలిసిన నీళ్లు చల్లారని బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్నాయి.
పశ్చిమబెంగాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా యువ మోర్చా ఇటీవల ఆందోళన బాట పట్టారు. నబన్న చలో పేరుతో నిరసన ప్రదర్శన నిర్వహించించారు. సెక్రటేరియట్ వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్నవారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనన్లతో నీళ్ళు జల్లారు. ఈ సందర్భంగా చాలా మంది నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీనిపైన ఎంపీ సుమిత్ర ఖాన్ మాట్లాడుతూ తీవ్రంగా విమర్శించారు.
బీజేపీ కార్యకర్తలపై కరోనా వైరస్ కలిపిన నీళ్ళను పశ్చిమ బెంగాల్ పోలీసులు జల్లారని ఆరోపించారు. బీజేపీ కేడర్ను అంతం చేయడానికే ఇలా చేశారని అన్నారు. తాము మరణించినా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ వివరాలతో కరపత్రాలను పంపిణీ చేస్తామన్నారు. కాగా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తర్వాత బీజేపీ కార్యకర్త రాజు బెనర్జీకి కోవిడ్-19 సోకిందని చెప్పారు. ఈ వైరస్ను వ్యాప్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ప్రమేయం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్లో అధికరణ 356ను ప్రయోగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సిండికేట్ పాలన అంతం కావాలన్నారు.