ఏపీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుందని అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. వచ్చే నెల రెండో వారం నాటికి వ్యాధి వ్యాప్తి తగ్గుతుందన్నారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వైరస్ తీవ్రత ఆగష్టు 21 తర్వాత తగ్గుతుందన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజుకు 70 నుంచి 80 మరణాలు నమోదవుతుండగా..ఆగష్టు 20 తర్వాత 50 కంటే తగ్గేఅవకాశం ఉందన్నారు. ఇక అనంత, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెప్టెంబరు 15 తర్వాత వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని చెప్పారు. మరోవైపు కరోనా నిర్దారణ పరీక్షల్లో ఏపీ దూసుకుపోతోంది.
ఇప్పటివరకు ఏపీలో 25,34,304 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పరీక్షలు చేసిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ మాత్రమే. ఇక ఏపీలో పాజిటివ్ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మరో రెండు నెలల కాలంలో ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గి యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది.