చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అంశంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కేంద్రం తన పరిధిలోనే వ్యవహరించిందని బీజేపీ నేత రామ్ మాధవ్ అన్నారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల లిమిటెడ్ రోల్ పోషిస్తుందన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం తన పరిధిలోనే ఉందన్నారు. రాష్ట్రంలో అద్దె ఇళ్లలో ఉండి ప్రభుత్వ కార్యకలాపాలు నడిచాయి.. బస్సుల్లోపల ముఖ్యమంత్రి సచివాలయాలు నడిపినప్పుడు కేంద్రం జోక్యం చేసుకోలేదన్నారు. మోదీ భుజాలపై తుపాకీ పెట్టి యుద్ధం చేయాలని చంద్రబాబు చూశారన్నారు. చంద్రబాబు హైదరాబాద్ను వదలి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసన్నారు. హైదరాబాద్లో ఉంటూ ఏపీలో రాజధాని కట్టుకోవాలని తాము అప్పట్లో చెప్పామన్నారు.
రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదగాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ బలమైన పోరాటం చేయాలన్నారు. ఇక ఇప్పటిదాకా మూడు రాజధానుల విషయంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడుకి ఈయన మాటలు గట్టిగానే తగిలాయని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో మూడు రాజధానులపై కేంద్రం మాట్లాడాలని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ మాధవ్ గతంలో అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రాజధాని ఏర్పాటు చేస్తే కూడా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు.