ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోతాయాన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆర్టీసీలో వందల్లో సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఏం చేయాలో అధికారులు ఆలోచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వేల ఆర్టీసీ బస్సులకు గాను ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా 3వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. బస్సులో ప్రయాణించేవారు మాస్కు ధరించడంతో పాటు బస్సు టికెట్ బుక్ చేసుకునేటపుడు ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా షరతులతో కూడిన ప్రయాణాలు ఆర్టీసీ కల్పిస్తోంది.
ఇప్పుడు ఆర్టీసీలో కూడా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 670 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మొదట్లో 5 నుంచి 10 మంది వరకు రోజూ కరోనా సోకుతుండగా ఇప్పుడు సంఖ్య ఎక్కువయ్యింది. ఆదివారం ఒక్క రోజే 71 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా ఇప్పటివరకు మొత్తం 10 మంది సిబ్బంది కరోనాతో చనిపోయారు. ఆదివారం నమోదైన కేసుల్లో కడప జోన్ నుంచే 31 మంది ఉన్నారు.
రోజురోజుకూ కేసులు ఎక్కువవుతుండటంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏం చేయాలన్నదానిపై చర్చించనున్నారు. సిబ్బందికి కరోనా వస్తే వారి ద్వారా ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఎదురుచూస్తున్నారు. కాగా గతంలో రోజుకు రూ. 13 కోట్ల దాకా ఆర్టీసీకి రాబడి ఉండేది. ఇప్పుడు రూ. 2కోట్లు కూడా దాటడం లేదు.