కరోనా వ్యాక్సిన్ కోసం తయారీ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు చివరి దశ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. దీంతో ఎప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాగా మరో రెండు మూడు నెలల్లో దేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుతుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.
ఢిల్లీ ప్రభుత్వం వ్యాక్సిన్పై ఫుల్ క్లారిటీతో ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ లభ్యతను బట్టి ఢిల్లీవాసులందరికీ కేవలం మూడు, నాలుగు వారాల్లోనే వాక్సిన్ అందించగలమని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ శనివారంనాడు తెలిపారు. పాలీక్లినిక్ వంటి ఆరోగ్య సౌకర్యాల సాయంతో మొత్తం ఢిల్లీలోని జనాభా అందరికీ త్వరితగతిన వాక్సిన్ వేయడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. వాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా అనుకున్న సమయంలోనే అందరికీ అందిస్తామని మంత్రి వివరించారు.
కాగా కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ వస్తే ఎలా పంపిణీ చేయాలన్న దానిపై కసరత్తులు చేస్తోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన మార్గదర్శకాలు కూడా కేంద్రం జారీ చేసింది. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించారు. మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో జైడస్ బయోటెక్ పార్క్లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై ఇవాళ సమీక్షించారు. వ్యాక్సిన్ తయారుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని, భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని తెలుసుకున్నారు. ఆ వెంటనే పుణే బయలుదేరారు.