ప్రపంచాన్నిగడగడలాడిస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం అందరూ వ్యాక్సిన్ తీసుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఇండియాలో కూడా కరోనా వ్యాక్సిన్ కావాలని ప్రజలు వేచి చూస్తున్నారు.
భారత్లో కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కావచ్చని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా తెలిపారు. డిసెంబర్ నెలఖరుకల్లా ఆక్సఫర్డ్ కరోనా టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ‘టీకా అత్యవసర వినియోగానికి కావాల్సిన అనుమతులు ఈ నెలాఖరుకల్లా రావచ్చు. అయితే..ప్రజలందరికీ టీకా ఇచ్చేందుకు అవసరమయ్యే పూర్తి స్థాయి అనుమతులు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. అయితే..ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిస్తే..వచ్చే ఏడాది జనవరిలోనే టీకా పంపిణీ ప్రారంభం కావచ్చు’ అని అదర్ పేర్కొన్నారు.
ఇటీవలే సీరమ్తో పాటూ భారత్ బయోటెక్ కంపెనీలు తమ కరోనా టీకాలకు అత్యవసర అనుమతులు కావాలంటూ కేంద్రాన్ని దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఒకటి ఏర్పాటైంది. అయితే..ఈ రెండు కంపెనీలు తమ ఫేజ్-2,3 క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి సేఫ్టీ డాటా(టీకా భద్రతకు సంబంధించిన సమాచారం), ఇమ్యునోజెనిసీటీ(రోగ నిరోధక శక్తిని టీకా ఏ స్థాయిలో ప్రేరేపిస్తుందో తెలిపే) వివరాలను ఇవ్వాలని కోరింది.