ఏపీలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆలయం అంతర్వేదిలో కరోనా కారణంగా దర్శనాలు నిలిపివేశారు. వారం రోజుల పాటు ఇక్కడ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి రోజూ వెయ్యి కొత్త కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అంతర్వేది చుట్టు ప్రక్కల గ్రామాల్లో కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇటీవలె దేవస్థానంలోని రథం దగ్దమైన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది వ్యక్తులు, ప్రజా హిందూ సంఘాలు అక్కడ ఆందోళనలు దిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఇద్దరికి కరోనా రావడంతో పోలీసులకు కూడా కరోనా సోకింది. జిల్లాలో ఏఎస్పీ, ఎస్పీతో పాటు మరో పది మందికి కూడా కరోనా సోకింది. పరీక్షలు చేయగా వీరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసిందన్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా ఇంకా వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. దీంతో వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేసి ఏకాంతంగా స్వామివారి కైంకర్యాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో నియంత్రించే క్రమంలో తమ పోలీసులకు కూడా కరోనా సోకినట్లు చెప్పారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలో 850 మంది పోలీసులకు కరోనా సోకినట్లు ఆయన తెలిపారు.