ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. విజయనగరం జిల్లాలో ఓ పాఠశాల విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. 20 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
జిల్లాలోని గంట్యాడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 108 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి కరోనా పరీక్షలు చేయగా 20 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా జిల్లా కలెక్టర్ ఘటనపై స్పందించారు. వెంటనే విద్యార్థులకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ విద్యార్థులకు లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్లో ఉండేలా చూడాలన్నారు.
ప్రతి రోజూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందం అడిగి తెలుసుకోవాలన్నారు. క్వారంటైన్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక మెడికల్ కిట్లు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక పాఠశాలల్లో శానిటైజర్, మాస్క్ ఉండేలా తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా లాక్డౌన్ తర్వాత ఇటీవల స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా రావడంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు పలువురు వాపోతున్నారు. ఆన్లైన్లోనే విద్యను బోధించాలని పలువురు కోరుతున్నారు.